న్యూఢిల్లీ/ టెహ్రాన్: ఇరాన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కంపెనీ కార్గో షిప్లో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. (Indians onboard ship) దీంతో వారి భద్రత, విడుదల కోసం భారత్ ప్రయత్నిస్తున్నది. ఇరాన్ పాలకులతోపాటు ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నది. ఇజ్రాయెల్ సంస్థకు చెందిన కార్గో షిప్ ఎంసీఎస్ ఏరీస్పై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ శనివారం దాడి చేశారు. హెలికాప్టర్ నుంచి దానిపై దిగిన కమాండోలు ఆ ఓడను స్వాధీనం చేసుకున్నారు. యూఏఈ తీరంలోని హార్ముజ్ జలసంధి సమీపం నుంచి ఇరాన్కు మళ్లించారు.
కాగా, ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఆ కార్గో షిప్లో 25 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో 17 మంది భారతీయులు. ఈ విషయం తెలిసిన వెంటనే భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇరాన్ స్వాధీనంలో ఉన్న ఓడలోని 17 మంది భారతీయ సిబ్బంది భద్రత, సంక్షేమం, విడుదల కోసం ఆ దేశ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఇరాన్ పాలకులతోపాటు ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయంతో దౌత్య మార్గాల ద్వారా భారతీయ సిబ్బందిని విడిపించేందుకు ప్రయత్నిస్తున్నది.