Northeastern States : ఈశాన్య రాష్ట్రాల్లో ఒకే ఛాసిస్ నెంబర్, ఒకే ఇంజిన్ నెంబర్తో 16,000 వరకు వాహనాలు రిజిష్టర్ అయినట్లు తాజాగా వెల్లడైంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిర్వహించిన తనిఖీల్లో ఈ సంచలనం బయటపడింది. దీనికి సంబంధించిన నివేదికను తాజాగా అసోం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసోంతోపాటు, మిగతా ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో వాహనాలకు సంబంధించి వాహన్ డాటాబేస్ను తనిఖీ చేయడం ద్వారా ఈ భారీ తప్పిదాన్ని గుర్తించారు.
మొత్తం 15,849 వాహనాలు దాదాపు ఒకే ఛాసిస్ నెంబర్, ఒకే ఇంజిన్ నెంబర్తో ఉన్నట్లు గుర్తించారు. ఇవి ఒకే రాష్ట్రంలో కాకుండా, రెండు, మూడు రాష్ట్రాల్లో రిజిష్టర్ అయి ఉన్నాయి. వీటిలో దాదాపు 76 శాతం.. అంటే 12,112 వాహనాలు ఒక్క అసోం రాష్ట్రంలోనే రిజిష్టర్ అయ్యాయి. ఎలాంటి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) లేకుండానే వీటి రిజిష్ట్రేషన్ జరిగింది. రూల్స్ ప్రకారం ప్రతి వాహనానికి ఒక ప్రత్యేక నెంబర్ ఉంటుంది. అది ఛాసిస్ నెంబర్ అయినా, ఇంజిన్ నెంబర్ అయినా ఒకదానితో ఒకటి మ్యాచ్ అవ్వదు. వీటి ఆధారంగానే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఒకవేళ ఒకరి నుంచి మరొకరికి, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారినప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలంటే మొదటిది క్యాన్సిల్ చేయాలి. కానీ, ఇవేవీ జరగకుండానే వాహనాల్ని ఇష్టమొచ్చినట్లు రిజిస్ట్రేషన్ చేసిన విషయం బయటపడింది.
ప్రధానంగా ఎనిమిది జిల్లా రవాణా కేంద్రాలలో ఈ వ్యత్యాసాల్ని గుర్తించారు. 2019-2024 మధ్య కాలంలో 1,19,369 రిజిష్టర్డ్ వాహనాలకు సంబంధించి 26,105 పర్మిట్లు మాత్రమే ఉన్నాయి. స్కూల్ బస్సులకు అనుమతుల మంజూరులో కూడా అవకతవకలు జరిగాయి. సరైన ఫిట్నెస్ టెస్టులు లేకుండానే స్కూల్, కాలేజీలు వంటి ఎడ్యుకేషనల్ బస్సులకు అనుమతులిచ్చినట్లు తేలింది. ఈశాన్య రాష్ట్రాల్లో 1.29 లక్షల వాహనాల్లో 29,560 వాహనాలు పన్నులే చెల్లించడం లేదు. దాదాపు రూ.61.28 కోట్ల పన్నుల్ని ఇలా ఎగ్గొట్టారు. అలాగే 24.53 కోట్ల జరిమానాలు కూడా ఎగవేశారు. వాహనాల కాలుష్య నియంత్రణకు సంబంధించి కూడా లోపాలు బయటపడ్డాయి. అయితే, అసోం వంటి రాష్ట్రంలో సరైన రవాణా శాఖ ఉద్యోగులు లేకపోవడం కూడా ఇలాంటి పొరపాట్లకు కారణాలుగా కనిపిస్తున్నట్లు కాగ్ వెల్లడించింది.