భోపాల్: మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో ఘోరం జరిగింది. అమ్మమ్మ వయస్సున్న 58 ఏండ్ల మహిళలపై 16 ఏండ్ల బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను కొట్టి చంపేశాడు. రెండేండ్ల క్రితం తనపై దొంగతనం అభియోగం మోపినందన్న పగతో ఈ ఘాతుకానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రేవాజిల్లాలోని కైలాశ్పురికి చెందిన ఓ 58 ఏండ్ల మహిళ తన భర్త, కుమారిడితో కలిసి నివాసం ఉంటున్నది. రెండేండ్ల క్రితం అదే వీధిలో ఉండే కుర్రాడు వారింట్లో టీవీ చూడటానికి వచ్చేవాడు. ఈ క్రమంలో వారి మొబైల్ ఫోన్ కనిపించకుండా పోయింది. దీంతో అతడే ఆ ఫోన్ను దొంగిలించాడని బాధితురాలి కుటుంబం ఆరోపించింది. దీంతో తన పరువుపోయిందని భావించిన బాలుడు.. వారిపై పగపెంచుకున్నాడు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించి.. అదనుకోసం వేచిచూస్తున్నాడు.
ఈ క్రమంలో జనవరి 30న బాధితురాలి భర్త, కుమారుడు బయటకి వెళ్లారు. దీంతో అదేరోజు రాత్రి ఆమె నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడ్డాడు. కేకలు వేయడంతో.. ఆమె నోట్లో గుడ్డను కుక్కాడు. ప్లాస్టిక్ కవర్, తాడు సాయంతో ఆ మహిళ ముఖాన్ని కట్టేసి పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్లోకి ఈడ్చుకెళ్లాడు. కొడవలితో ఆమెపై విచక్షణా రహితంగా దాడిచేశాడు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా మహిళ తల, ఇతర శరీర భాగాలపై దాడిచేశాడు. కర్రతో ప్రైవేట్ భాగాలను గాయపరిచాడు. దీంతో ఆమె మృతిచెందింది. అనంతరం బాధితురాలి ఇంట్లో నుంచి రూ.1000 నగదుతోపాటు బంగారు ఆభరణాలు తీసుకొని అక్కడినుంచి పరారయ్యాడు.
బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 1న హనుమాన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన అధికారులు.. బాలుడిని అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా తానే హత్యాచారానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసి జువైనల్ హోంకు తరలించామని ఏఎస్పీ వివేక్ లాల్ తెలిపారు.