తిరువనంతపురం: అత్యాచారం చేసిన వ్యక్తితో బాధిత బాలికకు పెళ్లి చేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు. కేరళలోని తిరువనంతపురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నేడుమంగడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలికపై 23 ఏళ్ల అమీర్ 2021లో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు కావడంతో అరెస్ట్ అయిన అతడు నాలుగు నెలల పాటు జైలులో ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఆ బాలిక ఇంటికి వెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. దీంతో ఆ బాలికను అతడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న వారిద్దరికీ వివాహం చేశారు.
కాగా, ఆ బాలిక చాలా రోజులుగా స్కూల్కు రావడం లేదు. స్కూల్ టీచర్లు ఆరా తీయగా ఆమెకు పెళ్లి చేసినట్లు తెలిసింది. దీంతో స్కూల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బాలికను పెళ్లి చేసుకున్న అమీర్, పెళ్లి తంతు జరిపించిన ఉస్తాద్ అన్వర్ సాదత్తోపాటు బాలిక తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ, పోక్సో చట్టం, బాల్య వివాహ నిషేధ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్థానిక మాఫియాతో సంబంధాలున్న అమీర్ పలు నేరాలకు పాల్పడ్డాడని, అతడిపై చాలా కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.