న్యూఢిల్లీ, నవంబర్ 4: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం ఏకమవుతున్నది. నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ), విద్యాసంస్థల ప్రాంగణాల్లో మతచిచ్చు రేపడం, ఫీజుల పెంపును నిరసిస్తూ దేశంలోని 16 ప్రముఖ విద్యార్థి సంఘాలు జాయింట్ ఫ్రంట్గా ఏర్పడ్డాయి. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, సీఆర్జేడీ, డీఎంకే స్టూడెంట్స్ వింగ్, ఎన్ఎస్యూఐ, సమాజ్వాది ఛత్ర సభ తదితర లెఫ్ట్, విపక్ష పార్టీల విద్యార్థి సంఘాలు ఇందులో ఉన్నాయి.
భాగస్వామ్య పక్షాలను సంప్రదించకుండా ఏకపక్షంగా నూతన విద్యా విధానాన్ని తేవడంపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. ఎన్సీఈఆర్టీ పుస్తకాలలో చరిత్ర, ఇతర సబ్జెక్టులలో కొన్ని అధ్యాయాలు తొలగించడం ద్వారా కేంద్రం మతతత్వాన్ని రెచ్చగొడుతున్నదని విమర్శించాయి. విద్యపై రాజ్యాంగ దార్శనికతకు ఇది పూర్తి విరుద్ధమని మండిపడ్డాయి. అంతేకాకుండా దేశం పేరు ‘ఇండియా’ను సైతం పాఠ్య పుస్తకాల నుంచి తొలగించేందుకు బీజేపీ యత్నిస్తున్నదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యాసంస్థల్లో ఫీజుల పెంపు, ఎన్ఈపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్టు వెల్లడించారు.