లక్నో: ఉత్తరప్రదేశ్లో మగువలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో మృగాళ్లు అతివలపై లైంగిక దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. సుల్తాన్పూర్ జిల్లాలో ఓ మైనర్ బాలికపై ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డారు. వారికి ఓ బాలిక, స్వయానా బాధితురాలి సోదరి సహకరించడం విశేషం. ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. తనిఖీల్లో భాగంగా గత మంగళవారం రాత్రి పోలీసులు సుల్తాన్పూర్లో ఓ లగ్జరీ బస్సును ఆపారు. అందులో తనిఖీ నిర్వహిస్తుండగా, చివరి సీటు కింద ముగ్గురు చిన్నారులను గుర్తించారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. వారిని విచారించగా ఓ అమ్మాయిపై లైంగిక దాడి జరిపినట్లు తేలిందని పోలీసు అధికారి బల్దీరాయ్ రాజారామ్ చౌదరీ చెప్పారు. దీంతో బస్సు డ్రైవర్తోపాటు, ఓ బాలుడు, బాధితురాలి సవతి సోదరిని అరెస్టు చేశామన్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.