న్యూఢిల్లీ, జనవరి 1: దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకంలో సామాజిక అసమానతలు ఉన్నట్లు కేంద్ర న్యాయ విభాగం నివేదికలో వెల్లడైంది. గత ఐదేండ్లలో హైకోర్టుల్లో నియమితులైన న్యాయమూర్తుల్లో కేవలం 15 శాతం మంది మాత్రమే వెనుకబడిన తరగతులకు చెందిన వారని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కేంద్ర న్యాయ విభాగం నివేదించింది. 2018 నుంచి 2022 డిసెంబర్ 19 వరకు హైకోర్టుల్లో మొత్తం 537 మంది న్యాయమూర్తులుగా నియమితులు కాగా ఇందులో 1.3 శాతం మంది ఎస్టీలు, 2.8 శాతం మంది ఎస్సీలు, 11 శాతం మంది ఓబీసీలు, 2.6 శాతం మంది మైనారిటీలు ఉన్నారని తెలిపింది. 20 మంది నియామకాలకు సంబంధించిన సామాజిక నేపథ్య వివరాలు అందుబాటులో లేవని వెల్లడించింది.