40 మందికిపైగా గల్లంతు
ఎగువ నుంచి ముంచెత్తిన జల ప్రవాహం
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
భారీ వరదకు కొట్టుకుపోయిన గుడారాలు
కేదార్నాథ్ విలయాన్ని తలపించిన ఘటన
రంగంలోకి ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
యాత్రకు తాత్కాలిక బ్రేక్.. నేడు పునరుద్ధరణ!
ప్రకృతి ప్రకోపంతో మేఘాలు గర్జించాయి. ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షంతో అమర్నాథ్ వణికిపోయింది. హఠాత్తుగా కురిసిన వాన చినుకు క్షణాల్లో వరదగా మారింది. గుడారాల్లో సేదతీరిన యాత్రికులు ముప్పును పసిగట్టేలోపే ముంచెత్తింది. చూస్తుండగానే వరదనీటిలో పదుల సంఖ్యలో యాత్రికులు కొట్టుకుపోయారు. కొంత మందిని సహాయ సిబ్బంది కాపాడిగలిగారు. శుక్రవారం రాత్రి వరకు అందిన సమాచారం మేరకు 15 మంది మృతిచెందారు. మరికొందరి ఆచూకీ తెలియాల్సి ఉన్నది. బురదలో కూరుకుపోయిన మృతదేహాలు.. కొన్నేండ్ల కిందటి కేదార్నాథ్ జల విలయాన్ని గుర్తుకుతెచ్చింది. అమర్నాథ్ బేస్క్యాంప్ ప్రాంతమంతా జలమయమైంది. దీంతో యాత్రను తాత్కాలికంగా రద్దు చేశారు. వాతావరణం సాధారణ స్థితికి వచ్చి, ఏర్పాట్లు పూర్తయితే శనివారం యాత్రను పునరుద్ధరించే అవకాశం ఉన్నది. సహాయం, సమాచారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటుచేశాయి.
శ్రీనగర్, జూలై 8: ప్రకృతి ప్రకోపించింది. మేఘాల గర్జనతో అమర్నాథ్లో పెనువిషాదం చోటుచేసుకున్నది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో జమ్ముకశ్మీర్లోని అమర్నాథ్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. వరదల కారణంగా 15 మంది మరణించగా, పదుల సంఖ్యలో యాత్రికులు గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి జోరున కురిసిన వర్షంతో అమర్నాథ్ పుణ్యక్షేత్రం ఎగువ ప్రాంతాలు, కొండలపై నుంచి వరద నీరు ఒక్కసారిగా పోటెత్తింది. దీంతో కింది ప్రాంతంలో ఉన్న గుడారాలు కొట్టుకుపోయాయి. గుడారాల్లో ఉన్న పదుల సంఖ్యలో యాత్రికులు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 15 మంది మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీయగా, 40 మందికి పైగా యాత్రికుల ఆచూకీ తెలియాల్సి ఉన్నది. గల్లంతైన వారి కోసం ఐటీబీపీతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ముగ్గురిని కాపాడారు. బాధితులను హెలికాప్టర్ల ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
అమర్నాథ్ ప్రాంతం జలమయం
అమర్నాథ్ పరిసరాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురిసింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. వరదల దృష్ట్యా అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. వర్షం కొనసాగుతున్నా.. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నదని ఐటీబీపీ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. వాతావరణం సాధారణ స్థితికి వచ్చి, తాత్కాలిక ఏర్పాట్లు పూర్తయితే శనివారం యాత్రను పునరుద్ధరించే అవకాశం ఉందని వెల్లడించారు. ఐటీబీపీ పీఆర్వో వివేక్ కుమార్ పాండే మాట్లాడుతూ.. అమర్నాథ్ గుహా ఎగువ ప్రాంతం నుంచి ఒక్కసారిగా వరద పోటెత్తిందని, సహాయ బృందాలను అప్రమత్తం చేసి అక్కడ టెంట్లలో ఉన్న యాత్రికులను 10-15 నిమిషాల్లో బయటకు తీసుకువచ్చామని తెలిపారు. అమర్నాథ్ వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్టు ట్విట్టర్లో పేర్కొన్నారు.
బ్యాచ్ల వారీగా దర్శనం
అమర్నాథ్లో మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఏటా భక్తులు పోటెత్తుతారు. కరోనా కారణంగా 2020, 2021లో యాత్ర జరగలేదు. ఈ ఏడాది జూన్ 30న ప్రారంభమైన ఈ యాత్రలో ఇప్పటి వరకు లక్ష మంది వరకు భక్తులు లింగాన్ని దర్శించుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. 43 రోజుల ఈ యాత్ర షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 11తో ముగియాల్సి ఉన్నది. అమర్నాథుడిని దర్శించుకోవాలంటే శ్రీనగర్కు 90 కిలోమీటర్ల దూరంలోని పహల్గామ్తో పాటు బాల్తా పట్టణాల మీదుగా రెండు రూట్లు ఉంటాయి. ఆయా మార్గాల్లో అధికారులు బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తారు. అక్కడి వరకు వచ్చిన వారిని బ్యాచ్ల వారీగా అమరనాథుడి దర్శనానికి పంపించేలా ఏర్పాట్లు చేస్తారు. వర్షాలు, తదితర ప్రతికూల కారణాలతో యాత్రకు తాత్కిలికంగా బ్రేక్ పడుతుంటుంది. ఈ క్రమంలో ప్రతికూల వాతావరణం కారణంగా మంగళవారం అధికారులు యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. అనంతరం వాతావరణం అనుకూలించడంతో యాత్రను పునరుద్ధరించారు.