హైదారాబాద్ : మధ్యప్రదేశ్(Madhya Pradesh )రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం( Road accident) చోటుచేసుకుంది. రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో 15 మంది మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ధార్ జిల్లాలోని ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై జరిగింది.
కూలీలను తీసుకెళుతున్న వ్యాన్ బోల్తా పడి(Van Overturns) మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే చనిపోగా.. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ధార్ జిల్లాలోని బగ్గద్ నుంచి 35 మంది కూలీలు పికప్ వ్యాన్లో ఇంటికి వస్తున్నారు.
బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో చిక్లియా క్రాసింగ్ దగ్గర డ్రైవర్ వ్యాన్ కంట్రోల్ కోల్పోయాడు. దీంతో వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఆ వెంటనే ఎదురుగా వస్తున్న ఎస్యూవీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 15 మంతి మృత్యువాతపడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా, ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ స్పందించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.4లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. బాధితులకు అండగా ఉంటామని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.