అహ్మదాబాద్: ప్రశ్నా పత్రం లీక్ కారణంగా గుజరాత్లో ఆదివారం జరగాల్సిన జూనియర్ క్లర్క్ పోటీ పరీక్ష హఠాత్తుగా వాయిదా పడింది. పరీక్ష జరగడానికి కొన్ని గంటల ముందు పేపర్ లీక్ కావడం పెను దుమారం లేపింది. ఈ ఘటనలో పోలీసులు 16 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వంద రోజుల్లోగా పరీక్ష నిర్వహిస్తామని, కొత్త తేదీని కొన్ని రోజుల్లో ప్రకటిస్తామని గుజరాత్ పంచాయత్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ చైర్మన్ సందీప్ కుమార్ ప్రకటించారు. దీంతో ఉదయాన్నే పరీక్ష కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు నిరాశ చెందారు. పేపర్ లీక్కు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 1181 జూనియర్ క్లర్క్ పోస్టుల కోసం 9.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్(ఏటీఎస్) ఎస్పీ సునీల్ జోషి మాట్లాడుతూ పేపర్ లీక్ చేసిన ముఠాలో 15 మంది వడోదరకు, ఒకరు హైదరాబాద్కు చెందినవారని వెల్లడించారు. ఒడిశాకు చెందిన ప్రదీప్ నాయక్ వడోదరలోని కేతన్ బరోత్, భాస్కర్ చౌదరిలకు ప్రశ్నా పత్రాన్ని అందజేస్తుండగా తమ బృందం పట్టుకుందని తెలిపారు. తెలంగాణలోని సంగారెడ్డి జల్లాలో గల కేఎల్ హైటెక్ ప్రెస్లో పని చేసే జీత్ నాయక్ ప్రదీప్ నాయక్కు ప్రశ్నా పత్రాన్ని ఇచ్చాడని వెల్లడించారు. ప్రశ్నా పత్రాల లీక్పై రాష్ట్రంలోని విపక్షాలు భగ్గుమన్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
సంగారెడ్డి జిల్లాలో గుజరాత్ ఏటీఎస్ తనిఖీలు
బొల్లారం: గుజరాత్లో పంచాయతీ రాజ్ శాఖ జూనియర్ క్లర్క్ రిక్రూట్మెంట్ పరీక్ష ప్రశ్నా పత్రాలు ముద్రించిన ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని కేఎల్ హైటెక్ ప్రింటింగ్ ప్రెస్లో గుజరాత్ ఏటీఎస్ అధికారులు ఆదివారం తనిఖీలు చేశారు. ఇక్కడ ఆపరేటర్గా పనిచేస్తున్న సర్దార్ రోహా, ఒడిశాకు చెందిన తన మిత్రుడు జీతు నాయక్తో కలిసి పరీక్ష సమయానికి రెండు గంటల ముందు పేపర్ లీక్ చేశారు. ఆంధ్రపదేశ్లోని మరో ప్రాంతంలోనూ ప్రశ్నా పత్రాలు ముద్రించినట్టు పోలీసులు గుర్తించారు.