Pregnant Women | చెన్నై : తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో వానలు దంచికొట్టిన సంగతి తెలిసిందే. తిరునేల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఈ రెండు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 696 మంది గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వివిధ ఆస్పత్రుల్లో చేర్పించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రెండు రోజుల్లోనే 142 మంది గర్భిణులు పండంటి బిడ్డలకు జన్మనిచ్చినట్లు పేర్కొన్నారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు.
ఇండియన్ నేవి హెలికాప్టర్లు సహాయక చర్యల్లో నిమగ్నమై, 3.2 టన్నుల రిలీఫ్ మెటిరీయల్ను అందజేశారు. గర్భిణులు, చిన్నారులతో పాటు లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తిరునేల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో సుమారు 40 లక్షల మంది వరద ప్రభావానికి గురైనట్లు అధికారులు పేర్కొన్నారు.
తూత్తుకుడి జిల్లాలో ఈ స్థాయిలో వర్షాలు పడటం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.