Dasna Jail | ఉత్తరప్రదేశ్లోని ఓ జిల్లా జైల్లో ఒకరు కాదు ఇద్దరు కాదు వందకుపైగా ఖైదీలు హెచ్ఐవీ బారిన పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జైల్లోకి వచ్చే ప్రతి ఒక్కరికీ హెచ్ఐవీ, టీబీ పరీక్షలు తప్పనిసరి. ఈ క్రమంలో 2016లో ఘజియాబాద్ దస్నా జిల్లా జైల్లోకి వచ్చిన ఖైదీలకు పరీక్షలు చేయగా 46 మందికి హెచ్ఐవీ నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి వారు జైల్లోనే ఉన్నారు.
ప్రస్తుతం హెచ్ఐవీ బారిన పడిన ఖైదీల సంఖ్య 140కి చేరినట్లు దస్నా జైలు అధికారి అలోక్ కుమార్ సింగ్ తెలిపారు. అందులో 35 మందికి టీబీ కూడా సోకినట్లు ఆయన వివరించారు. వారికి దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు సింగ్ తెలిపారు.
‘దస్నా జైలు ఖైదీలతో కిక్కిరిసి పోయింది. జైలులో 1,706 ఖైదీలను ఉంచేందుకు మాత్రమే సదుపాయాలు ఉండగా.. ప్రస్తుతం 5,500 మంది ఖైదీలు ఉన్నారు. వారిలో 140 మందికి హెచ్ఐవీ నిర్ధారణ అయ్యింది. అందులో 35 మందికి టీబీ ఉన్నట్లు గుర్తించాం. 2016 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 120 నుంచి 150 మంది హెచ్ఐవీ బాధితులు జైల్లో ఉన్నారు’ అని అలోక్ సింగ్ వివరించారు.