ముంబై : కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని ముంచెత్తిన సమయంలో ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోవడం, ప్రాణాధార ఔషధాల కొరతతో పాటు ఆక్సిజన్ తగినంత అందుబాటులో లేకపోవడం కలిచివేసింది. కొవిడ్-19 వ్యాప్తితో పలు మెట్రో నగరాల మాదిరే ముంబై నగరం తల్లడిల్లింది. దేశ ఆర్ధిక రాజధానిలో రోజూ పెద్దసంఖ్యలో కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి కట్టడికి కరోనా నియంత్రణలను బీఎంసీ, రైల్వే అధికార వర్గాలు కట్టుదిట్టంగా అమలు చేశాయి.
సెకండ్ వేవ్లో మాస్క్లు ధరించని 14 లక్షల మంది నుంచి రూ 28.2 కోట్లను జరిమానా కింద అధికారులు వసూలు చేశారు. సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందిన ఫిబ్రవరి 16 నుంచి జులై 1 మధ్యన ఈ భారీ మొత్తాన్ని అధికారులు కొవిడ్-19 నిబంధనల ఉల్లంఘనుల నుంచి వసూలు చేశారు. ఇక గత ఏడాది ఏప్రిల్ 8 నుంచి ఈ ఏడాది జులై వరకూ బీఎంసీ అధికారులు 29.38 లక్షల మంది నుంచి రూ 59.16 కోట్లు జరిమానా కింద రాబట్టారు. అంధేరి వెస్ట్, వెర్సోవ, జుహు బీచ్ ప్రాంతాల నుంచి అత్యధికంగా రూ 4 కోట్లు జరిమానా వసూలు చేశారు.