న్యూఢిల్లీ, జూన్ 1: ‘వడ్డించేది బారానా.. తగ్గించేది చారానా’అన్నట్టుంది కేంద్రప్రభుత్వ వైఖరి. కమర్షియల్ సిలిండర్పై గడిచిన ఐదు నెలల్లో ఎడాపెడా వడ్డించిన కేంద్రప్రభుత్వం.. బుధవారం సిలిండర్ రేటును కాస్త తగ్గించి భారీ ఊరట కల్పించినట్టు చెప్పుకొంటున్నది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్పై రూ.135ను తగ్గిస్తున్నట్టు ఇంధన సంస్థలు తెలిపాయి.
దీంతో హైదరాబాద్లో ఈ సిలిండర్ ధర రూ. 2,427.50కు తగ్గింది. అయితే, గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మాత్రం చమురు సంస్థలు ఎలాంటి సవరణలు చేయలేదు. ఈ ఏడాదిలో వాణిజ్య సిలిండర్పై పలు దఫాల్లో మొత్తంగా రూ. 355.5 వడ్డించిన కేంద్రప్రభుత్వం.. తాజాగా రూ.135ను తగ్గించింది. మరోవైపు, విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరను వరుసగా పది సార్లు పెంచుకుంటూ వచ్చిన కేంద్రం తాజాగా కాస్త తగ్గించింది. కిలోలీటర్పై రూ.1,563.97 (1.27 శాతం) తగ్గిస్తున్నట్టు కంపెనీలు పేర్కొన్నాయి. దీంతో ఢిల్లీలో ఏటీఎఫ్ కిలోలీటర్ ధర రూ. 1,21,475.74కు చేరింది.
మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు వాణిజ్య సిలిండర్ ధర రూ.1,515
ఎనిమిదేండ్లలో పెంచిన మొత్తం రూ.1,047
గత ఐదునెలల్లోనే పెంచిన మొత్తం రూ.355
తాజాగా తగ్గించింది రూ.135
ప్రస్తుతం హైదరాబాద్లో వాణిజ్య సిలిండర్ ధర రూ.2,427.5