PM Modi : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మర్కాపురం జిల్లాలోని రాయవరం వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతిచెందిన ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఇది చాలా విషాదకరమైన ఘటన అని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
కాగా ఏపీలోని మార్కాపురం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తున్న తెలంగాణకు చెందిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ను ఢీకొట్టింది. దాంతో బస్సులో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించినట్లు వెల్లడించారు. ప్రమాదం సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్ల సాయంతో ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు.