దిబ్రూగఢ్ : అసోంలో విషాదకర సంఘటన చోటు చేసుకున్నది. విషపూరితమైన పుట్టగొడుగులు తిని 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరికొందరు బాధితులు అవస్థతకు గురై దిబ్రూగఢ్లోని అసోం మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులందరూ చికిత్స పొందుతూ మృతి చెందారని ఏఎంసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రశాంత దిహింగియా తెలిపారు. గడిచిన వారం రోజుల్లో విషపూరితమైన పుట్టగొడుగులు తిని మైనర్ సహా 13 మంది మృతి చెందారు.
ఎగువ అసోం ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో 39 మంది ఆసుపత్రిలో చేరారని, వారిలో 13 మంది మృతి చెందారని సూపరింటెండెంట్ తెలిపారు. బాధితులు దిబ్రూగఢ్, టిన్సుకియా, శివసాగర్, చరైడియో జిల్లాలకు చెందిన వారని ఆయన తెలిపారు. వారిలో ఎక్కువ మంది టీ తోట ప్రాంతాలకు చెందిన వారని, ఎగువ అసోం ప్రాంతానికి చెందిన చాలా మంది జనం ప్రతి ఏటా విషపూరిత పుట్టగొడుగులను తినడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. బాధితుల్లో కిడ్నీ, కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు.