కోజికోడ్: కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. కోజికోడ్లో ఈ వైరస్ బారినపడిన ఓ 12 ఏండ్ల బాలుడు మరణించాడు. నిఫా వైరస్ కారణంగా బాలుడు మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. బాలుడి కుటుంబంలో ప్రస్తుతం ఎవరికి వైరస్కు సంబంధించిన లక్షణాలు లేవని తెలిపారు. కోజికోడ్లో పరిస్థితిని సమీక్షించడానికి ఇప్పటికే అధికారుల బృంధాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆ బాలుడిని కలిసినవారిని గుర్తించే పనిని ప్రారంభించామని తెలిపారు.
కాగా, 12 ఏండ్ల బాలుడు నిఫా లక్షణాలతో ఈనెల 3న కోజికోడ్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చేరాడు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. అతని నుంచి సేకరించిన నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్కు పంపించారు. అందులో నిఫా వైరస్ ఉన్నట్లు ఫలితాల్లో తేలిందని అధికారులు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా వైరస్ వల్లే అతడు మరణించాడని ధృవీకరించింది. ఈ నేపథ్యంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) బృంధాన్ని ప్రభుత్వం కోజికోడ్ పంపించింది.
కాగా, దేశంలో మొదటిసారిగా నిఫా కేసు కేరళలోని కోజికోడ్ జిల్లాలో 2018లో నమోదైంది. వైరస్ వల్ల నెల రోజుల వ్యవధిలో 17 మంది చనిపోగా, మరో 18 కేసులను రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించింది.