న్యూఢిల్లీ: హౌసింగ్ సొసైటీ (Delhi housing society)కి చెందిన 12 టవర్లు అన్ సేఫ్గా అధికారులు గుర్తించారు. కూలిపోయే ప్రమాదం ఉండటంతో అందులోని అపార్ట్మెంట్లు నివాసయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏడు రోజుల్లో ఖాళీ చేయాలంటూ నివాసితులకు నోటీసులు జారీ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ముఖర్జీ నగర్లోని సిగ్నేచర్ వ్యూ అపార్ట్మెంట్స్ను 2007-2009 మధ్య నిర్మించారు. ఎంఐజీ, హెచ్ఐజీ కేటగిరీల్లో 336 ఫ్లాట్లు ఉన్నాయి. అయితే 15 ఏళ్లకే అపార్ట్మెంట్లు ప్రమాదకరంగా మారాయి. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ) సాంకేతికంగా అధ్యయనం చేసి నిర్మాణ లోపాలను గుర్తించింది.
కాగా, కూలిపోయే ముప్పు ఉన్న 12 టవర్లను కూల్చివేయాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) నిర్ణయించింది. దీంతో డిసెంబర్ 25 నాటికి ఖాళీ చేయాలంటూ ఈ నెల 18న నోటీసులు జారీ చేసింది. అయితే ఏడు రోజుల్లో పూర్తిగా ఖాళీ చేయాలని ఆదేశించడంపై రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కొత్త ఫ్లాట్లు నిర్మించే వరకు డీడీఏ అద్దె చెల్లిస్తే ఖాళీ చేసేందుకు సిద్ధమని పేర్కొంది. అయితే మొత్తం 336 ఫ్లాట్లు ఖాళీ చేస్తేనే నివాసితులకు అద్దె చెల్లిస్తామని డీడీఏ గతంలో ప్రతిపాదించింది.