అమరావతి : సముద్రంలో వేటకు వెళ్లిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన 12 మంది మత్స్యకారులు గల్లంతైనట్లు సమాచారం. ఈ నెల 7న చెన్నైలోని కాశిమీడు ఫిషింగ్ హార్బర్ నుంచి బోటులో మత్స్యకారులు వేటకు వెళ్లారు. ఈ నెల 16 నుంచి వీరంతా ఎవరికీ అందుబాటులోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై విషయాన్ని ఫోన్లో ఆంధ్రప్రదేశ్ పశుసంవర్థక, మత్స్యశాఖల మంత్రి సీదిరి అప్పలరాజు దృష్టికి తీసుకెళ్లారు. గల్లంతైన మత్స్యకారులంతా శ్రీకాకుళం జిల్లా సిక్కోలు గ్రామానికి చెందిన వారని తెలిస్తున్నది. వీరంతా ఉపాధి కోసం కొంతకాలం క్రితం చెన్నై వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంతవరకు తమ వారి ఆచూకీ తెలియక పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆచూకీ తెలుసుకునేందుకు కృషి చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.