న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రి సత్యేందర్ జైన్ ఉన్న తీహార్ జైలులో 12 మంది అధికారులను తాజాగా బదిలీ చేశారు. జైళ్ల శాఖ మంత్రి అయిన ఆయనను మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. దీంతో రిమాండ్ నిమిత్తం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. విపక్షాలు ఆయన రాజీనామాకు డిమాండ్ చేసినప్పటికీ సత్యేందర్ జైన్ను మంత్రి పదవి నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్ తప్పించలేదు. అయితే జైళ్ల శాఖను మరొకరికి అప్పగించారు.
కాగా, మంత్రి హోదాలో జైల్లో ఉన్న సత్యేందర్ జైన్కు ప్రత్యేక సౌకర్యాలు అందుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో జైలు అధికారి అజిత్కుమార్ను సోమవారం సస్పెండ్ చేశారు. తాజాగా మరో 12 మంది తీహార్ జైలు సిబ్బంది, అధికారులను బదిలీ చేసినట్లు సంబంధిత వర్గాలు గురువారం తెలిపారు. సత్యేందర్ జైన్ ఉన్న సెల్కు నేరుగా కాపలాగా లేదా ఇన్ఛార్జ్గా ఉన్న వారిపై బదిలీ వేటు పడిందని చెప్పారు. ఆయనకు ప్రత్యేక సౌకర్యాల కల్పనలో వారి పాత్రపై కూడా దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.
మరోవైపు ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ తీహార్ జైల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఈడీ ఆరోపించింది. ఆయన జైల్లో పండ్లు, సలాడ్లు పొందడంతోపాటు కుటుంబ సభ్యులు, సాక్షులను కలుస్తున్నారని ఢిల్లీ కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో జైలు అధికారులతో జైన్ కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై కేంద్ర హోంశాఖ గత నెలలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ను నివేదిక కోరింది. ఆ నివేదిక ఆధారంగా పలు చర్యలు చేపట్టింది. జైలు అధికారి అజిత్కుమార్ను సోమవారం సస్పెండ్ చేయగా, తాజాగా మరో 12 మంది జైలు అధికారులను బదిలీ చేసింది. దీనికి ముందు జైళ్ల డీజీ సందీప్ గోయెల్ను కూడా ఈ నెలలో బదిలీ చేసి పోలీస్ హెడ్క్వాటర్స్కు అటాచ్ చేసింది.