లక్నో: ఉత్తరప్రదేశ్ను వైరల్ రోగాలు వణికిస్తున్నాయి. కాన్పూర్ జిల్లాలోని కుర్సౌలి గ్రామంలో వైరల్ రోగాలతో 12 మంది మరణించారు. అయితే వీరందరికీ డెంగ్యూ నెగిటివ్గా నిర్ధారణ అయ్యిందని సీనియర్ వైద్య అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామస్తుల మరణానికి కారణం ఏమిటన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. దోమల లార్వా కోసం గ్రామంలోని ఇండ్లలో సర్వే చేస్తున్నట్లు కాన్పూర్ నగర్ జిల్లా అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుబోధ్ ప్రకాష్ తెలిపారు. వైరల్ రోగాల పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తమ వైద్య బృందం ఇరవై నాలుగు గంటలు పని చేస్తున్నదని చెప్పారు.
కాగా, కాన్పూర్ జిల్లాలో గత నెలలో పిల్లలతో సహా 250 మంది వైరల్ జ్వరాల బారినపడ్డారు. వీరిలో కొందరికి డెంగ్యూ, మలేరియా ఉన్నట్లు గుర్తించామని లాలా లజపతిరాయ్ హాస్పిటల్ వైద్యాధికారులు ఇటీవల తెలిపారు. అలాగే సుమారు 200 మంది పిల్లలు వైరల్ జ్వరం, టీబీ వంటి రోగాలతో పిల్లల ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినట్లు ఆ ఆసుపత్రి అధికారి చెప్పారు. పరిస్థితి సీరియస్గా ఉన్న సుమారు 20 మంది పిల్లలు కోలుకుంటున్నారని వెల్లడించారు.