శ్రీనగర్: నూతన ఏడాది వేళ జమ్ముకశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. వేకువజామున గుడిలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మృతిచెందారు. మరో 1౩ మంది గాయపడ్డారు. కొత్త సంవత్సరం సందర్భంగా కశ్మీర్లోని రియాసి జిల్లా కత్రాలో ఉన్న మాతా వైష్ణోదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. దీంతో భక్తులు భారీగా తరలివచ్చారు.
ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున 2.45 గంటలకు వైష్ణోదేవీ భవన్లో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించారు. 1౩ మంది గాయపడ్డారు. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను పోలీసులు దవాఖానకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ దత్ తెలిపారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు వెల్లడించారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో ఆలయంలో తొక్కిసలాట జరిగిందన్నారు. మృతులను ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మకశ్మీర్ వాసులుగా గుర్తించారు.
జమ్ముకశ్మీర్ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
తొక్కిసలాటలో చనిపోయిన వారికి జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడినవారికి రూ.2 లక్షలు పరిహారం అందిస్తామని చెప్పారు.