Deportation | చండీగఢ్, ఫిబ్రవరి 16: అక్రమ వలసదారుల పట్ల అమానుష తీరుపై విమర్శలు వస్తున్నప్పటికీ అమెరికా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదు. 116 మంది భారత అక్రమ వలసదారులతో శనివారం రాత్రి చండీగఢ్కు విమానం చేరుకోగా, 112 మందితో మూడో విమానం ఆదివారం రాత్రి అమృత్సర్కు చేరుకుంది. విమానంలో తమ చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేసి నేరస్థుల్లా తీసుకువచ్చారని, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదని దల్జీత్ సింగ్ అనే ప్రయాణికుడు విమానంలో తాము ఎదుర్కొన్న భయానక అనుభవాలను వివరించాడు. పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లా కురాలా కలాన్ గ్రామానికి చెందిన దల్జీత్ సింగ్ తాను ఏజెంట్ చేతిలో మోసపోయినట్టు చెప్పాడు.
శనివారం రాత్రి 11.35 గంటలకు సి-17 విమానం విమానాశ్రయం చేరుకోగా ఇమిగ్రేషన్, వివరాల సేకరణ అనంతరం ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటలకు పంజాబ్కు చెందిన డిపోర్టీలను పోలీసు వాహనాలలో పంపించారు. రెండవ విమానం రావడానికి ముందు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విమానాశ్రమాన్ని సందర్శించి డిపోర్టీల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. డిపోర్టీలు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వాహనాలలో వారిని ఇళ్లకు పంపిస్తున్నట్టు చెప్పారు. భారతీయ అక్రమ వలసదారులతో వస్తున్న విమానాలను అమృత్సర్ విమానాశ్రయానికే ఎందుకు తీసుకువస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పంజాబ్ను అప్రతిష్ట పాల్జేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అంతకుముందు ఆయన ఆరోపించారు.