West Bengal : పశ్చిమ బెంగాల్లో దారుణ ఘటన జరిగింది. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపి, హత్య చేశారు. బాలిక మృతదేహం ఒక సంచిలో లభ్యమైంది. ఈ ఘటన బెంగాల్, దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఆదివారం వేకువఝామున జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందిన 11 ఏళ్ల బాలిక శనివారం కనిపించకుండా పోయింది. ఒక స్నేహితురాలి బర్త్డే కోసం గిఫ్ట్ కొనేందుకు బాలిక బయటకు వెళ్లింది. అయితే, ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురు వ్యక్తులు తమ బాలికను ఎత్తుకెళ్లారని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో ఆదివారం వేకువఝామున బరుయ్పూర్ ప్రాంతంలోని, సుర్జ్యాపూర్ హాట్ ప్రాంతంలో ఒక సంచిలో బాలిక మృతదేహం లభ్యమైంది. బాలికను అత్యాచారం చేసి, హతమార్చినట్లు గుర్తించారు. ఈ విషయం తెలియడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. నిందితులను వెంటనే పట్టుకుని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బరుయ్పూర్-జోయ్నగర్ రోడ్డును దిగ్బంధించారు. వందలాది మంది ఆందోళనకారులు రోడ్డుపై టైర్లు తగలబెడుతూ ఆందోళనకు దిగారు. పోలీసుల వాహనాలపై కూడా దాడి చేశారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కూడా పంపించకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనపై ప్రెసిడెన్సీ రేంజ్ ఐజీ కంకార్ ప్రసాద్ స్పందించారు. నిరసనకారులు ఆందోళన విరమించాలని కోరారు. ఘటనతో సంబంధం ఉన్న నిందితులు అందరినీ అరెస్టు చేస్తామని, ఎవరినీ వదిలిపెట్టబోమని హామీ ఇచ్చారు. పోలీసులు హామీతో బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు.
పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. బాలిక మృతికి గల కారణాలు అప్పుడే తెలుస్తాయన్నారు. ఇప్పటికే ఈ ఘటనతో సంబంధం ఉన్న ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మిగిలిన వారి కోసం కూడా గాలిస్తున్నామని ఐజీ తెలిపారు. బెంగాల్ సీఎం సువేందు అధికారి బాలిక తండ్రితో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. బాలిక కుటుంబానికి న్యాయం చేస్తామని, నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు బాలిక మృతిపై బరుయ్పూర్ ప్రాంతంలో ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్ని అదుపు చేయడానికి ప్రభుత్వం కేంద్ర బలగాల్ని మోహరించింది.