న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో తప్పిపోయిన 11 మంది పర్వతారోహకులు మృతిచెందారు. కనిపించకుండాపోయిన మరో ఆరుగురి కోసం లాంఖగా పాస్పై భారత వైమానికి దళం గాలిస్తున్నది. పర్వతారోహకులు, పర్యాటకులు, పోర్టర్లు, గైడ్లతో కూడిన 17 మంది బృందం ఈనెల 14న హిమాచల్ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లా నుంచి ఉత్తరాఖండ్లోని ఉత్కర్షికి బయల్దేరారు. అయితే హిమాలయ పర్వత శ్రేణుల్లో భారీ హిమపాతం, వాతావరణం అనుకూలించకపోవడంతో ఈనెల 18న ఉత్తరాఖండ్లోని లాంఖగా పాస్ వద్ద వారు దారితప్పిపోయారు. దీంతో వారికోసం పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది, భారత వాయుసేన గాలింపు చేపట్టింది.
ఈ క్రమంలో సముద్ర మట్టం నుంచి 17 వేల ఫీట్ల ఎత్తులో ఉన్న లాంఖగా పాస్పై వారంతా చిక్కుకోవడంతో అత్యాధునిక తేలికపాటి హెలికాఫ్టర్లను వాయుసేన రంగంలోకి దింపింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం 11 మంది మృతదేహాలను గుర్తించారు. 16800 ఫీట్ల ఎత్తులో ఉన్న వారి మృతదేహాలను కిందికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా కనిపించకుండా పోయిన మరో ఆరుగురి కోసం గాలింపు ముమ్మరం చేశారు.