న్యూఢిల్లీ, జూలై 14: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు ప్రభుత్వం ఊరట కలిగించే వార్తను చెప్పింది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే కరవు భత్యం (డీఏ), పింఛన్దారులకు ఇచ్చే కరువు ఉపశమనాన్ని (డీఆర్) పునరుద్ధరించడంతో పాటు వాటి మొత్తాన్ని పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం 17 శాతంగా ఉన్న డీఏ/డీఆర్ను 28 శాతానికి (11 శాతం పెంపు) పెంచుతున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది జూలై 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. డీఏ/డీఆర్ పెంపు వల్ల ఖజానాపై అదనంగా రూ.34,401 కోట్ల మేర భారం పడనుందని వివరించారు. అయితే, ఈ నిర్ణయంతో 48.34 లక్షల మంది ఉద్యోగులు, 65.26 లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి చేకూరనుందని చెప్పారు. కొవిడ్ నేపథ్యంలో 2020 జనవరి 1, 2020 జూలై 1, 2021 జనవరి 1న చెల్లించాల్సిన డీఏ/డీఆర్ను కేంద్రం నిలిపివేసింది. ఈ కాలానికి ఎలాంటి ఎరియర్స్ చెల్లించబోమని మరోసారి స్పష్టంచేసింది.
ఏడాది తర్వాత తొలిసారిగా
కొవిడ్-19 సంక్షోభం వల్ల గత కొంతకాలంగా వర్చువల్ మాధ్యమంలోనే కేంద్ర క్యాబినెట్ సమావేశాలు జరిగాయి. అయితే, ఏడాది తర్వాత మొదటిసారిగా బుధవారం ప్రధాని మోదీ ప్రత్యక్షంగా కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు.