రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని బలోడా బజార్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బలోడా బజార్ జిల్లాలోని భాటపరా పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న ఖమారియా ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న ట్రక్కు, పికప్ వ్యాన్ ఢీకొన్నాయి. దీంతో పికప్ వ్యాన్లో ప్రయాణిస్తున్న 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో పది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బాధితులంతా ఓ వివాహ వేడుకలో పాల్గొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వారంతా సింగా సమీపంలోని ఖిలోరా గ్రామానికి చెందినవారని చెప్పారు.
కర్ణాటకలోని ధార్వాడ్లో జరిగిన మరో ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ధార్వాడ్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతులను బెళగావి జిల్లా కిట్టూర్ వాసులుగా గుర్తించారు.