సిమ్లా, ఆగస్టు 11: ఒకవైపు పెద్ద కొండ… మరోవైపు లోయలో పరవళ్లు తొక్కుతూ సట్లేజ్ నది…కొండ అంచున నిర్మించిన మార్గంలో వాహనాలు ఒకదాని వెనుక మరొకటి నెమ్మదిగా కదులుతున్నాయి… ముందు 30 సీటర్ బస్సు వెళుతుంటే దాని వెనుక లారీ, నాలుగు కార్లు వెళుతున్నాయి. అంతలోనే పెనుముప్పు ముంచుకొచ్చింది. బండరాళ్లు దొర్లుకుంటూ దూసుకొచ్చాయి. భారీ కొండచరియలు విరిగి వాహనాలపై పడ్డాయి. నిమిషాల్లో ఆ వాహన శ్రేణి శిథిలాల కింద కూరుకుపోయింది. మరికొన్ని వాహనాలు నుజ్జయ్యాయి. హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లా చౌరా గ్రామం వద్ద బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 11 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని ఆందోళన చెందుతున్నారు. మరో 14 మందిని శిథిలాల నుంచి బయటకుతీసి కాపాడారు. దీనికి 7-8 గంటలు పట్టింది. వారంతా తీవ్రంగా గాయపడ్డారు. 40 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. గంటసేపు బండరాళ్లు దొర్లిపడుతూనే ఉన్నాయి. సుమో వాహనాన్ని క్రేన్లతో వెలికితీశారు. అందులో ప్రయాణిస్తున్న 8 మంది చనిపోయారు. మృతులకు కుటుంబాలకు ప్రధాని మోదీ రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.
ప్రకృతి విపత్తులు మనిషి పుణ్యమే!
న్యూఢిల్లీ: ఉత్తరభారతం.. ముఖ్యంగా హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న రాష్ర్టాల్లో ఇటీవల ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. కుంభవృష్టి, ఆకస్మిక వరదలు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం లాంటి ప్రమాదాలు సాధారణంగా మారిపోతున్నాయి. వందలాది ప్రాణాలను బలిగొంటున్నాయి. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన హిమాలయాల్లో మానవ ప్రమేయం ఎక్కువ కావడం, అభివృద్ధి పేరుతో సాగిస్తున్న ప్రకృతి విధ్వంసమే ఇందుకు కారణమని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. హైడ్రోపవర్ ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వత శ్రేణులతో పోల్చితే హిమాలయాల వయస్సు చాలా తక్కువ. వాటికి స్థిరత్వం తక్కువ. ఫలితంగా కొండలకు పగుళ్లు ఏర్పడటం సహజమని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణం, టన్నెల్ రోడ్ల కారణంగా పగుళ్లు వేగవంతం అవుతున్నాయని చెప్పారు.