లుథియానా : పంజాబ్లో ఆదివారం ఘోర దుర్ఘటన చోటుచేసుకొన్నది. లుథియానాలోని గియాస్పురలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ముగ్గురు మైనర్లతో సహా 11 మంది మరణించారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. మరణించిన వారిలో 10 మంది మూడు కుటుంబాలకు చెందిన వారే కావడం గమనార్హం. మృతుల్లో ఎక్కువ మంది వలస కార్మికులే ఉన్నట్టు తెలుస్తున్నది.
జనసాంద్రత ఎక్కువగా ఉండే నివాస, పారిశ్రామిక ప్రాంతమైన గియాస్పురలో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ విషాద ఘటన జరిగింది. అయితే లీకైన గ్యాస్ ఏంటి? ఎక్కడి నుంచి వెలువడింది? అనే దానిపై స్పష్టత లేదు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్గ్రేషియో ప్రకటించింది.