అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక లైంగిక దాడి కేసులోజీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం నాడు విడుదల చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. నారీశక్తి గురించి ఒకవైపు నీతులు వల్లెవేసిన ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వం.. అత్యంత కిరాతక చర్యకు పాల్పడిన దోషులను ఎలా విడుదల చేస్తారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో బిల్కిస్ బానో కేసుపై పూర్వాపరాలు ఇవి..
2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో అల్లర్లు చెలరేగాయి. ఈ సమయంలో బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని కొందరు దుండగులు పాశవికంగా హత్య చేశారు. అంతటితో ఆగకుండా ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానో (అప్పుడు వయసు 21)తో పాటు ఆమె తల్లిపై సామూహిక లైంగికదాడికి తెగబడ్డారు.
ఈ కేసులో మొత్తం 19 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. సరైన సాక్ష్యాలు లేకపోవడంతో ఏడుగురిని సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న నిర్దోషులుగా విడుదల చేసింది. 11 మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది. మిగిలిన ఒకడు ట్రయల్ జరుగుతున్న సమయంలో మరణించాడు.
2017లో బాంబే హైకోర్టు కూడా సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించింది. దీంతో దోషులు 15 ఏండ్లు కారాగారంలో శిక్ష అనుభవించారు. బిల్కిస్కు రూ. 50 లక్షల పరిహారాన్ని ఇవ్వాలంటూ గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
తనను విడుదల చేయాలంటూ దోషుల్లో ఒకడు గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇప్పటికే తాము 15 ఏండ్ల 4 నెలలు జైలు జీవితాన్ని గడిపామని, రెమిషన్ విధానాన్ని కల్పించాలని కోరాడు. అతడి విజ్ఞప్తిని పరిశీలించాలని అత్యున్నత ధర్మాసనం గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఈ అంశంపై ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. కమిటీ సభ్యుల సిఫారసు మేరకు దోషుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
దోషుల విడుదలపై కాంగ్రెస్ స్పందిస్తూ.. బీజేపీ నేతృత్వంలో ‘బేటీ బచావో’ ఇదేనా? అని ప్రశ్నించింది. హంతకులను, రేపిస్టులను విడుదల చేసిన ప్రభుత్వం.. తీస్తా సీతల్వాద్ను జైల్లో పెట్టిందని సీపీఎం ధ్వజమెత్తింది. ‘నవ భారత్’ ఇదేనా? అని ప్రశ్నించింది.
బిల్కిస్ బానో కేసులో దోషులను 1992 నాటి రెమిషన్ (శిక్షా కాలం తగ్గింపు) విధానం కింద విడుదల చేసినట్టు గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది. కాగా, గుజరాత్ తన రెమిషన్ విధానాన్ని 2014లో సవరించింది. దాని ప్రకారం.. లైంగికదాడి, హత్య కేసుల్లో దోషులకు శిక్ష తగ్గింపు కుదరదు. 1992 నాటి విధానంలో అలాంటి నిబంధనలు ఏమీ లేవు.
నా జీవితాన్ని నాశనం చేసిన ఆ హంతకులను విడుదల చేశారు. ఈ చర్య న్యాయవ్యవస్థపై నాకు ఉన్న విశ్వాసాన్ని కోల్పోయేలా చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలకు న్యాయం ఎలా దక్కుతుంది? భయం లేని నా మునుపటి ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదించే హక్కు నాకు ఇవ్వాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోరుతున్నా. నాతో పాటు నా కుటుంబ సభ్యుల భద్రతకు భరోసా ఇవ్వండి.
-బుధవారం మీడియాతో బిల్కిస్ బానో
– నేషనల్ డెస్క్