సూర్యాపేట టౌన్, జూలై 2 : ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించాలంటే ఆర్థిక వనరులు కాదు.. ఆక్సిజన్ అవసరం ఉంటుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కరోనా దెబ్బతో అందరికీ ఆక్సిజన్ విలువ తెలిసిందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ప్రధాన ఆస్తి పర్యావరణమేనని, హరితహారంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా మంత్రి శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 18వ వార్డు విజయ కాలనీలో వార్డు ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారానికి అంకురార్పణ చేశారని కొనియాడారు. ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేశారని.. కళ్లెదుట కనిపిస్తున్న మొక్కలే నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, కౌన్సిలర్ మాలోతు కమలాచందూ నాయక్, నాయకులు వై.వెంకటేశ్వర్లు, ఉప్పల ఆనంద్, రామగిరి నగేశ్, కీసర వేణు గోపాల్రెడ్డి, అనిల్రెడ్డి, సత్తిరెడ్డి, అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, మున్సిపల్ కమిషనర్ రామానుజుల్రెడ్డి పాల్గొన్నారు.
జి.తిరుమలగిరిలో ఆకస్మిక తనిఖీ
మంత్రి జగదీశ్రెడ్డి చివ్వెంల మండలం జి.తిరుమలగిరిలో ఆకస్మికంగా పర్యటించి పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. హరితహారంలో భాగంగా మొక్క నాటారు. గ్రామంలో రంగురంగుల పూలమొక్కలతో ఇంటి వాకిలిని అందంగా తీర్చిదిద్దిన కూరెళ్లి రమ్యను మంత్రి జగదీశ్రెడ్డి శాలువాతో సత్కరించారు. విద్యుత్ ఏడీ రామ్మోహన్రెడ్డి, సర్పంచ్ కంచర్ల నిర్మలా గోవిందరెడ్డి, ఏంపీఓ గోపి, ఉప సర్పంచ్ రేణుక పాల్గొన్నారు. అనంతరం భీమ్లా తండాలో రైతులతో సమావేశమయ్యారు. పత్తి, కంది, వేరుశనగ, మిర్చి సహా ఉద్యాన పంటలు ఎంచుకోవాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ఎంపీపీ ధరావత్ కుమారీ బాబూనాయక్, జడ్పీటీసీ భూక్యా సంజీవ్ నాయక్, వైస్ ఎంపీపీ జూలకంటి జీవన్రెడ్డి, సర్పంచ్ హముడా, ఎంపీటీసీ బండ్లయ్య, జిల్లా వ్యవసాయ, ఉద్యాన అధికారులు రామారావు నాయక్, శ్రీధర్ పాల్గొన్నారు.