100 Terrorists Killed | ‘ఆపరేషన్ సిందూర్’లో 100 మంది ఉగ్రవాదులు (100 Terrorists Killed) హతమైనట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఇవాళ ఉదయం కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన వివరాలను రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రస్థావరాలపై ఆర్మీ చేపట్టిన దాడుల్లో 100 మంది మరణించినట్లు రాజ్రాథ్ తెలిపారు.
జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. ఆ ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్పై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో ప్రతిదాడికి దిగి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)తోపాటు పాకిస్థాన్లోని మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్, లష్కరే తాయిబా, హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడితో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబం మొత్తం హతమైంది. ఆయన ఫ్యామిలీలోని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు నలుగురు సహాయకులు, సన్నిహితులు కూడా మరణించినట్లు తెలిసింది.
భారత్ దాడితో రగిలిపోతున్న పాక్.. ప్రతిచర్యగా భారత్పై ఏక్షణమైనా దాడులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా రాజస్థాన్ (Rajasthan), పంజాబ్ (Punjab) రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు సిబ్బంది సెలవులను రద్దు చేశాయి. అంతేకాదు బహిరంగ సభలపై కూడా నిషేధం విధించాయి. పాక్తో రెండు రాష్ట్రాల సరిహద్దులను పూర్తిగా మూసివేశారు. సరిహద్దు వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్పులు జరిపేలా భద్రతా దళాలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
Also Read..
Fact Check | ‘ఫేక్ యుద్ధాని’కి తెరలేపిన పాక్.. ‘ఫ్యాక్ట్ చెక్’తో చెక్ పెట్టిన భారత్
NIA | ఉగ్రఘటన సమాచారం ఉంటే మాతో పంచుకోండి.. స్థానికులను కోరిన ఎన్ఐఏ
Operation Sindoor | రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్.. పోలీసు సిబ్బందికి సెలవులు రద్దు