UP rains : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం మండువేసవిలో అకాల వర్షాల (Unseasonal rains) తో అతలాకుతలమైంది. తీవ్రమైన గాలి దుమారం, భారీ వర్షం సృష్టించిన పెనుబీభత్సం కారణంగా రాష్ట్రంలో ఒక్కరోజే 100 మంది ప్రాణాలు కోల్పోయారు. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురిసింది. గాలి దుమారం, వడగళ్ల వాన, పిడుగుల కారణంగా మే 13న పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ వర్షాల కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో 100 మంది మృతిచెందారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. 114 జంతువులు మరణించాయి. 87 ఇళ్లు ధ్వంసమయ్యాయి.
యూపీ రిలీఫ్ కమిషనర్ కార్యాలయం ఈ విషయాలను వెల్లడించింది. అకాల వర్షాలవల్ల జరిగిన ఆస్తి, ప్రాణనష్టంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరాతీశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం సమీక్షిస్తున్నారని, వర్ష ప్రభావిత జిల్లాల్లో ముమ్మర సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రయాగ్రాజ్, భదోహి, సోన్భద్ర, ఫతేపుర్ తదితర జిల్లాల్లో గాలివాన బీభత్సం జరిగింది. ప్రయాగ్రాజ్లో 21 మంది, భదోహిలో 16 మంది, ఫతేపుర్లో 11 మంది, సంత్ రవిదాస్ నగర్లో 14 మంది, మీర్జాపుర్లో 10 మంది మృతి చెందినట్లు ఆయా జిల్లాల యంత్రాంగాలు వెల్లడించాయి.
ఆయా జిల్లాల్లో అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. సాధారణంగా మే నెలలో ఉత్తర భారతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. చాలాచోట్ల సగటు ఉష్ణోగ్రత 40 డిగ్రీల పైనే ఉంటుంది. ఆ సమయంలో భూఉపరితలంపై ఉండే గాలి విపరీతంగా వేడెక్కుతుంది. అది వేగంగా కదులుతూ ఇతర దిశల నుంచి తడిగాలిని లాగేసుకుంటుంది. ఈ రెండు కలిసి ఆకాశంలో చాలా ఎత్తుకు చేరినప్పుడు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. దట్టమైన నల్లటి మబ్బులు ఆకాశమంతా విస్తరిస్తాయి. ఆ తర్వాత తక్కువ సమయంలోనే భారీ వర్షం, వడగళ్లు, పిడుగులు పడుతాయి.
ఇప్పుడు యూపీలో ఇలాంటి పరిస్థితే ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బరేలీ జిల్లాలో బలమైన ఈదురు గాలుల కారణంగా ఓ వ్యక్తి పతంగిలా పైకి ఎగిరి కింద పడ్డాడు. గాలిదుమారం రావడంతో సదరు వ్యక్తి ఓ షెడ్డును పట్టుకుని నిలబడ్డాడు. అయితే గాలి తీవ్రతకు షెడ్డుతో సహా ఎగిరిపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ఘటనలో తీవ్ర గాయపడిన అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.