Air India | న్యూఢిల్లీ, మే 1: ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ధరలు విపరీతంగా పెరగడంతో అనేక మార్గాలు ఆర్థికంగా లాభదాయకం కాకుండా పోయాయని పేర్కొంటూ ఎయిర్ ఇండియా రోజుకు సుమారు 100 విమానాలను తగ్గించనున్నది. శుక్రవారం ప్రకటించిన ఈ నిర్ణయం దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు రెండింటినీ ప్రభావితం చేయనున్నది. టాటా గ్రూపు యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా సంస్థ ప్రస్తుతం రోజుకు సుమారు 1,100 విమానాలను నడుపుతున్నది. తాజా తగ్గింపులు ఎయిర్లైన్స్ షెడ్యూల్లో దాదాపు 10 శాతానికి సమానం. ఐరోపా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్కు వెళ్లే సుదూర అంతర్జాతీయ మార్గాల్లో నడిచే విమానాలకు కోత పడనున్నట్లు తెలుస్తున్నది.
ఢిల్లీ, ముంబైని లండన్, పారిస్, న్యూయార్క్, టొరంటో, శాన్ ఫ్రాన్సిస్కో, సిడ్నీ, బెల్బార్న్తో అనుసంధానించే కీలక కారిడార్లలో ఇక తక్కువ సంఖ్యలో విమానాలు తిరిగే అవకాశం ఉంది. డిమాండు అధికంగా ఉండే సింగపూర్కు సైతం విమాన సర్వీసులు తగ్గిపోనున్నాయి. ఏటీఎఫ్ ధరల పెంపు సమస్యతోపాటు భౌగోళిక రాజకీయ అంతరాయాలు కూడా సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. గగనతల ఆంక్షల కారణంగా విమానయాన సంస్థలు ముఖ్యంగా యూరప్, ఉత్తర అమెరికాకు వెళ్లే విమానాల్లో ఎక్కువ సమయం పట్టే, అధిక ఇంధనం వినియోగించే మార్గాలను ఎంచుకోవలసి వస్తున్నది. ఈ దారి మళ్లింపుల వల్ల ఇప్పటికే తక్కువగా ఉన్న లాభాలపై మరింత భారం పడుతున్నది.
ఎఫ్ఐఏ హెచ్చరిక
ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్జెట్ వంటి ప్రధాన ఎయిర్లైన్స్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్(ఎఫ్ఐఏ) వంటి పరిశ్రమ సంస్థలు ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే మరిన్ని సర్వీసుల నిలిపివేతలు పెరగవచ్చని హెచ్చరించాయి.