లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పదేళ్ల బాలుడు అయాన్ గుప్తా పదేళ్లకే పదో తరగతి పాసై చరిత్ర సృష్టించాడు. చదువులో ఎప్పుడూ చురుగ్గా ఉండే అయాన్ గుప్తా.. ఇంట్లో తన స్కూల్ పుస్తకాలను తిరిగేశాడు. అయితే ఒకే క్లాస్ పుస్తకాలు బోర్ అనిపించడంతో పై తరగతుల పుస్తకాలను చదవడం మొదలుపెట్టాడు. బాలుడి టాలెంట్ను గుర్తించిన తల్లిదండ్రులు, స్కూల్ ప్రిన్సిపల్ లాక్డౌన్ అనంతరం అతడిని 9వ తరగతిలో జాయిన్ చేశారు.
గత ఏడాది 9వ తరగతి, ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలను పూర్తిచేశాడు. అంతేగాక 10వ తరగతి డిస్టింక్షన్లో పాసై చరిత్ర సృష్టించాడు. అయాన్కు మొత్తం 76.6 శాతం మార్కులు వచ్చాయి. హిందీలో 73 మార్కులు, ఇంగ్లిష్లో 74 మార్కులు, మ్యాథమెటిక్స్లో 82 మార్కులు, సైన్స్లో 83 మార్కులు, సోషల్ సైన్స్లో 78 మార్కులు, కంప్యూటర్ పేపర్లో 70 మార్కులను అయాన్ సాధించాడు.
అసాధారణ బాలుడైన అయాన్ 8వ తరగతి వరకు పుస్తకాలను ఇంట్లోనే చదువుకున్నాడని, లాక్డౌన్ అనంతరం బులంద్షహర్ జిల్లా జహంగీరాబాద్లో శివకుమార్ ఇంటర్ కాలేజీ ప్రిన్సిపల్తో మాట్లాడి 9వ తరగతిలో జాయిన్ చేశామని తల్లిదండ్రులు చెప్పారు. యూపీ ప్రభుత్వ నిబంధన ప్రకారం 14 ఏళ్లు నిండిన వారినే 10వ తరగతి పరీక్షలకు అనుమతిస్తారని, బాలుడి టాలెంట్ చూసి తాను అయాన్ 10 ఏళ్లకే పరీక్ష రాసేలా ప్రత్యేక అనుమతి తీసుకున్నానని ప్రిన్సిపల్ తెలిపారు.