కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 26/రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దంతెవాడ జిల్లాలో పోలీసుల వాహనం లక్ష్యంగా ఐఈడీ బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు, డ్రైవర్ మరణించారు. దంతెవాడ జిల్లాలోని అరన్పూర్ ఏరియా అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ) పోలీసులు యాంటి మావోయిస్టు ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో మార్గమధ్యంలో మావోయిస్టులు పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని టార్గెట్గా చేసుకొన్నారు. రోడ్డుపై ఓ చోట గుంత తీసి ఐఈడీ అమర్చారు. పోలీసుల వాహనం సరిగ్గా ఆ ప్రాంతం వద్దకు రాగానే పేలుడుకు పాల్పడ్డారు.
20 అడుగుల పైకి ఎగిరిన వ్యాన్
ఈ మారణకాండకు మావోయిస్టులు దాదాపు 50 కిలోల ఐఈడీ వినియోగించినట్టు తెలుస్తున్నది. పేలుడు ధాటికి పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం 20 అడుగుల ఎత్తు మేర పైకి ఎగిరి కిందపడింది. వ్యాన్ తునాతునకలైంది. ఘటనాస్థలిలో 10 అడుగుల లోతు, 20 అడుగుల వెడల్పుతో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఘటనపై ఛత్తీస్గఢ్ ఐజీ సుందర్రాజ్ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దాడి అనంతరం ఘటనాస్థలికి చేరుకొన్న పలు ప్రత్యేక బృందాలు.. ఆ ఏరియాలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.