PM Surya Ghar | న్యూడిల్లీ, ఫిబ్రవరి 29: రూఫ్టాప్ సోలార్ స్కీమ్ ‘పీఎం-సూర్యఘర్: ముఫ్తి బిజిలీ యోజన’కు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. కోటి ఇండ్లకు ఉచిత విద్యుత్తు అందించేందుకు అవసరమైన సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.75,021 కోట్లతో ఈ పథకం అమలుచేయనున్నారు. పథకంలో భాగంగా కిలోవాట్లోపు విద్యుత్తు ఉత్పత్తి చేసే సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు రూ.30 వేలు, రెండు కిలోవాట్ల యూనిట్కు రూ.60 వేలు, మూడు అంతకంటే ఎక్కువ కిలోవాట్ల యూనిట్కు రూ.78 వేలు సబ్సిడీ అందజేస్తారు. దీని కోసం నేషనల్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం కోరింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. 2025నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటుచేస్తామని తెలిపారు.
ఈ ఖరీఫ్ సీజన్కు ఫాస్పేట్, పొటాషియం ఎరువులపై 24,220 కోట్ల సబ్సిడీని ఇస్తున్నట్టు కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది. డీఏపీ క్వింటాల్ రూ.1350, పొటాష్ 50 కిలోల బస్తా రూ.1,670, ఎన్పీకే బస్తా 1,470 చొప్పున లభిస్తాయని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 2024-25 ఖరీఫ్ సీజన్కు ఫాస్పేట్, పొటాషియం ఎరువులపై న్యూట్రియంట్ ఆధారిత సబ్సిడీ (ఎన్బీఎస్) ప్రతిపాదనలను ఆమోదించామన్నారు.
దేశంలోని పులులు, ఇతర పెద్ద జంతువుల పరిరక్షణలో భాగంగా గ్లోబల్ నెట్వర్క్ ఏర్పాటుకు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ (ఐబీసీఏ)ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం గురువారం నిర్ణయించింది. కొన్ని ముఖ్యమైన లోహాల రాయల్టీ శాతాన్ని నిర్ధారించడానికి మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ చట్టం రెండో షెడ్యూల్ సవరణను మంత్రివర్గం ఆమోదించింది. రాయల్టీ రేటు నిర్దేశానికి ఆమోదం లభించడం వల్ల ఈ 12 లోహాలకు సంబంధించిన గనులను మొదటిసారిగా వేలం వేయడానికి ప్రభుత్వానికి వీలు కలుగుతుంది.
దేశీయ అవసరాలకు ఇతర దేశాల ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడానికి దేశంలో మూడు సెమీ కండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గుజరాత్, అస్సాంలో వీటిని ఏర్పాటుచేయనున్నారు. రానున్న 100 రోజుల్లో వీటి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి ఠాకూర్ తెలిపారు. తైవాన్కు చెందిన పవర్చిప్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్ప్తో కలిసి టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుజరాత్లోని దొలేరాలో సెమీకండక్టర్ ఫ్యాబ్ను ఏర్పాటుచేయనుంది. అస్సాంలోని మోరిగావ్లో టాటా సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మరో యూనిట్ను నెలకొల్పనుంది. అలాగే జపాన్కు చెందిన రెనసస్ గ్రూప్, థాయ్లాండ్కు చెందిన స్టార్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్తో కలిసి సీజీ పవర్ గుజరాత్లోని సనంద్లో మరో యూనిట్ను ఏర్పాటుచేయనుంది.