Manipur | ఇంఫాల్ : మణిపూర్లోని సిరౌలో తిరుగుబాటుదారులు దారుణానికి పాల్పడ్డారు. బీఎస్ఎఫ్ జవాన్లు, అసోం రైఫిల్స్ సైన్యంపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు అసోం రైఫిల్స్ సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ సైనికులను మంత్రిపుఖ్రీ ఆస్పత్రికి తరలించారు.
ఈ సందర్భంగా ఇండియన్ ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది. సిరౌ ఏరియాలో తిరుగుబాటుదారుల కార్యక్రమాలను అణిచివేసేందుకు నిన్న రాత్రి అసోం రైఫిల్స్, బీఎస్ఎఫ్ జవాన్లు కలిసి చర్యలు చేపట్టారు. ఆ సమయంలో తిరుగుబాటుదారులు కాల్పులు జరపడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఒక జవాను మృతి చెందాడని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. తిరుగుబాటుదారుల ఆచూకీ కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
సోమవారం కాంగ్చూప్ జిల్లాలో రెండు వర్గాలకు చెందిన కొంత మంది పరస్పరం కాల్పులు జరుపుకోవడంతో ముగ్గురు చనిపోయారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారు ఇంఫాల్ సర్కారీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. కాక్చింగ్ జిల్లా సెరో ప్రాంతంలో మరో రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయని, ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.