న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి వచ్చేనెల 11వ తేదీవరకు జరుగుతాయి. కొంత విరామం తర్వాత మార్చి 14న తిరిగి సమావేశాలు మొదలై ఏప్రిల్ 8 వరకు కొనసాగుతాయి. బడ్జెట్ సమావేశాల్లో కొవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉన్నందున ఉభయసభలను షిఫ్టులవారీగా నిర్వహించాలని నిర్ణయించారు. 2021 తర్వాత కొవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో లోక్సభ, రాజ్యసభ బడ్జెట్ సమావేశాలను వేరువేరు సమయాల్లో నిర్వహించడం ఇది రెండోసారి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఐదుగంటలపాటు రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఐదుగంటల పాటు లోక్సభ సమావేశాలు జరుగుతాయి. సభ్యులను దూరందూరంగా కూర్చోబెట్టేందుకు లోక్సభ, రాజ్యసభ చాంబర్లను, గ్యాలరీలను కలిపి వాడుకుంటారు. ఫిబ్రవరి 1న లోక్సభ ఉదయం 11 గంటలకు సమావేశమైనప్పుడు బడ్జెట్ సమర్పిస్తారు. మరుసటిరోజు నుంచి సభ నిరవధికంగా వాయిదా పడే 11 వతేదీ వరకు సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు సమావేశాలు కొనసాగుతాయి. రాజ్యసభ సమయాలు ఇంకాఖరారు కాలేదు. ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 2 వరకు సమావేశాలు జరుగుతాయని తెలుస్తున్నది. 31న రాష్ట్రపతి కోవింద్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి.