న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,17,100 కేసులు నమోదయ్యాయి. 214 రోజుల తర్వాత మళ్లీ లక్షకు పైగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నిర్ధారణ అయిన మొత్తం కేసుల సంఖ్య 3,52,26,386కు చేరింది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 3,007కు చేరాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 876 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ ఉంది. తాజాగా దేశంలో 302 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,83,178కు చేరింది.
7 రోజుల హోం క్వారంటైన్ తప్పనిసరి
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా 7 రోజులపాటు క్వారంటైన్లో ఉండాలని కేంద్రం తెలిపింది. 8వరోజు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. అనంతరం పరీక్ష నివేదికను ఎయిర్ సువిధ పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. ఇవి 11 నుంచి అమల్లోకి వస్తాయని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగుతాయని పేర్కొంది. మరోవైపు శుక్రవారం నాటికి 150 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు ప్రజలకు వేశారు.
సెకండ్ వేవ్ కన్నా 7 రెట్లు.. ఫస్ట్ వేవ్ కన్నా 11 రెట్లు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మొదటి వేవ్లో రోజువారీ కరోనా కేసులు 10వేల మార్కు దాటాక అక్కడి నుంచి లక్షకు చేరడానికి 98 రోజులు పట్టింది. సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యాక రోజువారీ కేసులు 10వేల మార్కు నుంచి లక్ష మార్కును దాటడానికి 63రోజులు పట్టింది. ప్రస్తుతం అది కేవలం 9 రోజులే. డిసెంబర్ 29న దేశంలో కొత్తగా పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి. జనవరి 6న రోజువారి కేసులు లక్ష మార్కును దాటాయి. ప్రస్తుతం కరోనా వేగానికి ఈ అంకెలే నిదర్శనం.