న్యూఢిల్లీ, మార్చి 6: కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతోపాటు పలు ఇతర డిమాండ్ల సాధన కోసం రైతన్నలు బుధవారం చలో ఢిల్లీ మార్చ్ చేపట్టారు. దీంతో రైతులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. పదుల సంఖ్యలో రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) తెలిపింది. రైతుల మార్చ్ నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. పెద్ద ఎత్తున బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఢిల్లీ-హర్యానా సింఘు సరిహద్దు, ఢిల్లీ-నోయిడా సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
తమ ఆందోళన ఇప్పుడు దేశవ్యాప్తమైందని రైతు నాయకుడు సర్వన్సింగ్ పంధేర్ తెలిపారు. రాజస్థాన్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన సుమారు వంద మంది రైతులను మార్గమధ్యలో నిర్బంధించారని ఆయన చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం రైతుల ఆందోళన పంజాబ్ వరకే పరిమితమని చెబుతున్నదని పంధేర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న శంభు, ఖానౌరీ సరిహద్దు వద్ద కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇందులో మహిళా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని పంధేర్ తెలిపారు. తమ ఆందోళనకు హర్యానాలోని ఖాప్ పంచాయితీలు కూడా మద్దతు తెలిపాయని వెల్లడించారు.