హైదరాబాద్, జూలై 23(నమస్తే తెలంగాణ) : శాంతియుత ఉద్యమాన్ని అణచివేత చర్యలతో గానీ, రాజకీయ కుయుక్తులతో గానీ నొక్కేయాలని చూస్తే అది ప్రజావిస్ఫోటానికి దారితీసి, ప్రభుత్వ పునాదులనే కదిలిస్తుందని ప్రముఖ కవి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం ‘ఎక్స్’ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన సుదీర్ఘ లేఖ రాస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని మోదీ గారూ.. మీరు ఇప్పటికైనా రాజకీయ ప్రయోజనాలకతీతంగా, విజ్ఞతతో వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉన్నది‘ అని సూచించారు. ఢిల్లీ వేదికగా దేశ యువత చేపట్టిన ఉద్యమం వెనుక ఎలాంటి రాజకీయశక్తుల ప్రమేయం లేదని, అది వారి బంగారు భవిష్యత్తు, ఆత్మగౌరవం కోసం స్వచ్ఛందంగా సాగిస్తున్న చారిత్రాత్మక సమరమని దేశపతి స్పష్టంచేశారు. యువత హృదయాల్లో రగులుతున్న తీవ్ర అసంతృప్తిని కేవలం ఒక నిరసనగా చూడకూడదని, దేశంలో సుపరిపాలన కోసం వారు వ్యక్తం చేస్తున్న ఆకాంక్షగా గుర్తించాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఉద్యమిస్తున్న నిరుపేద, నిరుద్యోగ యువత తమ హకుల పట్ల పూర్తి అవగాహనతో, గాంధే య మార్గంలో శాంతియుతంగా పోరాడుతున్నారని దేశపతి కొనియాడారు. అధికారం శాశ్వతం కాదు.. అది ప్రజాస్వామ్యం ప్రసాదించిన ఒక బాధ్యత మాత్రమేనని హెచ్చరించిన దేశపతి, పాలకులు ఏం చేసి నా చెల్లుతుందనే అహంకారంతో ఉండటం మంచిది కాదని హితవు పలికారు.