నేను మోదీని.. కాదు మోనార్క్ని! నేను చెప్పిందే వేదం.. చేసేదే శాసనం! నాకు ఎదురుండొద్దు.. పార్టీ నుంచైనా! నా తర్వాతా నా వాడే.. నేను నిలబెట్టినవాడే! ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్న తీరిది. మొన్నటిదాకా నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, శివరాజ్సింగ్ చౌహాన్ అధికారాలకు కత్తెర పెట్టిన ఆయనిప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ఎసరు పెడుతున్నట్టు బీజేపీ వర్గాల సమాచారం. తనకు అత్యంత సన్నిహితుడిని యూపీ సీఎం పీఠం ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నారట.
న్యూఢిల్లీ: దగ్గర్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. పార్టీలన్నీ గెలుపు కోసం అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకొంటున్నాయి. ఒక్క ప్రధాని మోదీ తప్ప. ఆయన సొంత పార్టీ నేత, ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్కు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా యోగిని తప్పించి, తనకు అత్యంత సన్నిహితుడైన యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఏకే శర్మకు అధికారం అప్పగించాలని చూస్తున్నట్టు బీజేపీ వర్గా లు గుసగుసలాడుకొంటున్నాయి. ఆ పార్టీ మాజీ ఎంపీ హరినారాయణ్ రాజ్భర్ ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ‘మన కోసం మన రాష్ట్రం కోసం ఏకే శర్మను సీఎంగా చూడాలనుకొంటున్నా. అందుకు శాయశక్తులా శ్రమిస్తా. దీనికోసం మనమంతా ప్రతిజ్ఞ చేద్దాం. బీజేపీ అధినాయకత్వం నా అభ్యర్థనను పరిగణించాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల వెనుక మోదీ ఉన్నారని ఆ పార్టీ నేతలే చర్చించుకొంటున్నారు. భవిష్యత్తులో పార్టీలో, ప్రభుత్వంలో తనకు ఎవరూ పోటీ రావొద్దనే ఇలా చేస్తున్నారని చెప్తున్నారు. కర్ణాటకలో యడియూరప్పను తప్పించినప్పుడే, యోగిని కూడా తప్పించాలని మోదీ ప్రయత్నించారని, యోగి వేరే పార్టీ పెడతానని హెచ్చరించే సరికి సైలెంట్ అయిపోయారని అంటున్నారు.
వాస్తవానికి, యోగి సీఎం కావాలని మోదీ ఎప్పుడూ కోరుకోలేదట. ఆరెస్సెస్ ఒత్తిడి వల్లే యోగిని సీఎంగా ఒప్పుకొన్నారట. ఇప్పుడు కూడా యోగిని హైలైట్ చేయొద్దన్న ఉద్దేశంతోనే ప్రచారంలో తాను ఎక్కువగా పాల్గొంటున్నారని తెలుస్తున్నది. పూర్వాంచల్లో గట్టి పట్టున్న యోగి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 100 సీట్లలో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకొన్నారు. ఎప్పటికైనా యోగితో ప్రమాదమేనని మోదీ అనుకొంటున్నారని, అందుకే ఆయన్ను తప్పించాలని చూస్తున్నారని అంటున్నారు. గత జూన్లో యోగి ఆదిత్యనాథ్కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదు. మోదీ విష్ చేయకపోవటం బీజేపీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. పార్టీలో తనకు గండం అవుతారనుకొన్న అందర్నీ మోదీ ఇలాగే పక్కకు తప్పిస్తున్నారని అనుకొంటున్నారు. ఇప్పటికే కేంద్రం లో తనకు ఎదురులేకుండా చేసుకొనేందుకు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ అధికారాలకు కత్తెర వేశారని, శివరాజ్సింగ్ చౌహాన్ను పక్కనబెట్టారని గుసగుసలాడుతున్నారు.
గడ్కరీకే తెలియకుండా ఆయన అధీనంలోని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ను మోదీ నియమించారని గుసగుసలు వినిపించాయి. మీడియాలో తన కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకొన్న స్మృతి ఇరానీని అప్పటికప్పుడు తప్పించారని చెప్తున్నారు. తన తర్వాత అమిత్ షాకే పట్టం కట్టేలా మోదీ పావులు కదుపుతున్నారని, యోగి ప్రభ పెరిగితే సమస్య అవుతుందని భావించే చెక్ పెట్టాలని చూస్తున్నట్టు చర్చించుకొంటున్నారు. తన బ్యాచ్ అధికారంలో ఉంటే తన మాటకు ఎదురుండదని మోదీ అనుకొంటున్నారని జోరుగా చర్చ నడుస్తున్నది. కాకపోతే.. ఆరెస్సెస్ మాత్రం యోగి ఆదిత్యనాథ్, నితిన్ గడ్కరీకే మద్దతుగా నిలుస్తున్నట్టు సమాచారం.