ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. కొత్త కేసులు అక్కడ రికార్డు స్థాయిలో వెలుగు చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు కఠిన ఆంక్షలు విధించినా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో మరో 56,286 మందికి కొవిడ్-19 పాజిటివ్గా తేలింది. ఇదే సమయంలో కరోనా నుంచి 36,130 మంది కోలుకోగా, వైరస్ వల్ల 376 మంది ప్రాణాలు కోల్పోయారు.
ముంబై నగరంలోనూ ఉద్ధృతి ఏమాత్రం తగ్గినట్లు కనిపించట్లేదు. ఒక్క రోజు వ్యవధిలోనే 8,938 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. తాజాగా మరో 23 మంది చనిపోయారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 32,29,547కు పెరిగింది. ఓవరాల్గా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 57,028కు పెరిగింది.