పాట్నా, సెప్టెంబర్ 16: బీహార్లోని కటిహార్ గ్రామానికి చెందిన గురుచరణ్ విశ్వాస్ స్కూల్ విద్యార్థి. బడి యూనిఫాం, ఇతర ఖర్చుల కోసం ప్రభుత్వం నుంచి అతనికి స్కాలర్షిప్ రావాల్సి ఉంది. అకౌంట్లో డబ్బులు పడ్డాయా.. లేదా.. చెక్ చేసుకోవడానికి ఇంటర్నెట్ సెంటర్కు వెళ్లాడు. అకౌంట్లో లాగిన్ అయ్యాడు. డబ్బును చూసి షాక్ అయ్యాడు. ఖాతాలో స్కాలర్ షిప్ పడలేదు కానీ ఎక్కడి నుంచో రూ.900 కోట్లు వచ్చిపడ్డాయి. ఆరో తరగతి చదువుతున్న, అదే గ్రామానికి చెందిన ఆశిష్ పరిస్థితి కూడా అదే. అతని ఖాతాలో రూ.6.2 కోట్లు జమయ్యాయి. ఇది తెలిసిన కటిహార్ గ్రామస్థులంతా తమ పాస్బుక్లు, ఏటీఎంలు తీసుకొని బ్యాంకులు, ఏటీఎంలు, ఇంటర్నెట్ సెంటర్లకు పరుగులు తీశారు. తమకు కూడ డబ్బులు వచ్చాయేమోనని అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. ఇద్దరు విద్యార్థులకు ఉత్తర్ గ్రామీణ్ బ్యాంకులో ఖాతా ఉంది. సాంకేతిక సమస్యల వల్ల డబ్బు జమ అయినట్టు బ్రాంచ్ మేనేజర్ చెప్పారు.