న్యూఢిల్లీ : కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, పరిస్థితి సాధారణంగా ఉంటే రాష్ట్ర హోదా సైతం ఇవ్వనున్నట్లు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. శనివారం వర్చువల్ విధానంలో జమ్మూకశ్మీర్ జిల్లా గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ను విడుదల చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల ఖరారు కోసం డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని, పరిస్థితి సాధారణ స్థితికి చేరిన వెంటనే రాష్ట్ర హోదా ఇవ్వనున్నట్లు చెప్పారు.
జమ్మూ కశ్మీర్లో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఈ ఏడాది రికార్డుస్థాయిలో పర్యాటకులు వచ్చారన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు నేరుగా పొందుతున్నారని, ఈ మోడల్ను ఇతర రాష్ట్రాలూ అనుసరించాలన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, చీఫ్ సెక్రెటరీ డాక్టర్ అరుణ్ కుమార్ మెహతా, కేంద్ర పరిపాలనా సంస్కరణలు అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్మెంట్ అధికారులు, రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.