కాఠ్మాండ్, జనవరి 22: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేడుకలు నేపాల్లోని మాదేశ్ ప్రావిన్స్ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. శ్రీరాముడి భార్య సీతాదేవి జన్మస్థలంగా భావిస్తున్న జనకపుర్ధామ్కు సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగితపు జెండాలు, రంగు రంగుల దీపాలతో జనకపురి వీధులు కళకళలాడాయి. గ్రామస్తులు 1.25 లక్షల దీపాల్ని వెలిగించారు. ఇక్కడి సీతాదేవి ఆలయానికి (జనకపుర్ధామ్) తరలివచ్చిన భక్తుల జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అలాగే మాదేశ్ ప్రావిన్స్లో ప్రజలు పెద్ద ఎత్తున ఈ వేడుకలు జరుపుకున్నారు. తమ ఇండ్ల వద్ద దీపాల్ని వెలిగించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భజనలు, కీర్తనలతో సీతారాముల్ని కొలిచారు. దేవాలయాల్ని సందర్శించి పూజలు చేశారు.