లక్నో, ఆగస్టు 14: ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారోద్యమం ద్వారా బీజేపీ, ఆరెస్సెస్ తమ ‘చీకటి పేజీలను’ దాచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ధ్వజమెత్తారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా జరుపుకొంటున్న ‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవాల పవిత్రతను ధ్వంసం చేసేందుకు బీజేపీ నడుం బిగించిందని ఆయన విమర్శించారు. చాలా చోట్ల బీజేపీ కార్యకర్తలు జాతీయ పతాకాలను అమ్ముతున్నట్టు వార్తలు వస్తున్నాయని అఖిలేశ్ పేర్కొంటూ.. కోట్లాది మంది భారతీయులకు గర్వకారణమైన మువ్వన్నెల జెండా.. అలాంటి పతాకం బీజేపీకి అంగడి సరుకుగా మారిందని మండిపడ్డారు.