(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రక్షణ రంగంలో దేశం స్వయంసమృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించిన ‘ఆత్మనిర్భర్ భారత్’ మిషన్ అనుకొన్న లక్ష్యాలను చేరుకోవట్లేదని తెలుస్తున్నది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు (ఓఎఫ్) తయారు చేసే ఆయుధాలకు భారత ఆర్మీ నుంచి ఆర్డర్లు రాకపోవడమే దీనికి ఉదాహరణ. ఈ మేరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇటీవల పార్లమెంట్కు ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. మిలిటరీ, పోలీసు అవసరాల కోసం ఆయుధాల కొనుగోలుకు కేంద్రహోంశాఖ ఓఎఫ్లకు 28 శాతం, రాష్ర్టాలు, యూటీలు 24 శాతం, ప్రైవేటు కంపెనీలు 22 శాతం ఆర్డర్లు ఇవ్వగా, ఆర్మీ నుంచి కేవలం 10 శాతం మాత్రమే ఆర్డర్లు వచ్చినట్టు ఆడిట్ రిపోర్ట్లో పేర్కొంది. 5.56 ఎంఎం ఇన్సార్ రైఫిల్, 5.56 ఎంఎం ఎల్ఎంజీ, 9 ఎంఎం ఆటో పిస్తోల్ వంటి చిన్న ఆయుధాలను దేశీయ పరిశ్రమల నుంచి కొనేందుకు కూడా ఆర్మీ ఆసక్తి చూపించట్లేదని వెల్లడించింది. 2015-16 నుంచి 2019-20 మధ్య డాటాను విశ్లేషించి నివేదిక తయారుచేసినట్టు కాగ్ వివరించింది.
40 శాతం వరకు ఆయుధాలను రక్షణశాఖ ఇంకా విదేశాల నుంచే దిగుమతి చేసుకొంటున్నదని, ఇలాంటి సమయంలో భారత్ స్వయం సమృద్ధి ఎలా సాధించగలదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రక్షణ రంగానికి బడ్జెట్లో కేటాయింపులు కూడా అంతకంతకూ తగ్గుతున్నాయని, ఇలాంటప్పుడు స్వయం సమృద్ధి సాధ్యంకాదని అభిప్రాయపడుతున్నాయి.