ముంబై, జూలై 17: మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలడంలో కీలకపాత్ర పోషించిన శివసేన రెబెల్ ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్కు ప్రస్తుత ఏక్నాథ్ షిండే ప్రభుత్వం బహుమతి ఇచ్చింది. సత్తార్ కుటుంబానికి చెందిన స్పిన్నింగ్ మిల్కు రూ.15.17 కోట్ల నిధులను విడుదల చేసింది. రూ.80 కోట్ల ప్రాజెక్టు అయిన స్పిన్నింగ్ మిల్కు స్టేట్ క్యాపిటల్ వాటాగా ఈ నిధులు విడుదల చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. కానీ ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ-ఏక్నాథ్ వర్గం ప్రభుత్వం ఏర్పాటు కావడంలో సత్తార్ కీలక పాత్ర పోషించారని అందుకే ఆయనకు ప్రస్తుత ప్రభుత్వం బహుమతిని ఇచ్చిందని పలువురు పేర్కొంటున్నారు. గతంలో ఉద్ధవ్ ప్రభుత్వంలో సత్తార్ మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. శివసేన రెబెల్ వర్గంలో ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన తొలి వ్యక్తి సత్తార్ అని తెలిపారు. దీన్నే కిడ్ప్రోకో (నీకిది.. నాకది) అని కూడా అంటారని చెప్పారు. నిధుల విడుదలపై సత్తార్ను వివరణ కోరగా.. ‘రాష్ట్ర ప్రభుత్వ సాయంతో ఇటీవలే స్పిన్నింగ్ మిల్ను స్థాపించాం. నా కుమారుడు చూసుకుంటున్నాడు. దీని ఏర్పాటు వల్ల చాలా మందికి ఉపాధి లభిస్తుంది’ అని పేర్కొన్నారు.